‘బ్రిటీష్‌ పాలనకంటే ఘోరంగా బాబు పాలన’

31 Aug, 2018 18:43 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న గట్టు శ్రీకాంత్‌ రెడ్డి, కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులు

సాక్షి, కడప : తనను ప్రశ్నిస్తే జైలుకే అంటున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన బ్రిటీష్‌ పాలన కంటే ఘోరంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గట్టు శ్రీకాంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గట్టు శ్రీకాంత్‌ రెడ్డితో పాటు కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. మైనారిటీల అక్రమ అరెస్టులపై వారు ధ్వజమెత్తారు. మైనారిటీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ..  నారా హమారా, టీడీపీ హమారా.. ప్రభుత్వ కార్యక్రమమా.. పార్టీ కార్యక్రమమా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా మైనారిటీలు పడుతున్న ఇబ్బందులను గుర్తించని బాబుకు ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి భూటకపు ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. మైనారిటీ సంక్షేమానికి కట్టుబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనేనని అన్నారు. మైనారిటీలను వేధిస్తుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. బాబును ఊరికే పొగడాలంటే తమ వల్ల కాదని అన్నారు. చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోమని అడగటం నేరమా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు