కోడెల! మీపై కేసులు పెడుతోంది టీడీపీ నేతలే..

13 Jun, 2019 11:08 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావుపై కేసులు పెడుతోంది టీడీపీ నేతలేనని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కోడెలపై కేసులు పెట్టే ధైర్యం చేయలేకనే ఇప్పుడు పెడుతున్నారని అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద గోపిరెడ్డి మాట్లాడుతూ.. నరసరావుపేటలో మీరు ఎప్పుడైనా ప్రోటోకాల్ పాటించారా? ఏ స్పీకర్ అయినా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా? అని కోడెలను ప్రశ్నించారు. స్పీకర్ పదవిలో ఉండి కూడా మీరు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్ని సార్లు తిట్టారో గుర్తులేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట, సత్తెనపల్లిలో కోడెల అరాచకాలు అన్నీ ఇన్నీ కావని, అన్నా క్యాంటీన్‌లలో భోజనం కూడా మింగేశారని ఆరోపించారు.

వందలు, వేల మంది ‘కే టాక్స్’ మీద ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ‘కే టాక్స్ ’పై ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని, లేదా సీబీసీఐడీ వేయాలని కోరారు. దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. కోడెల కుమారుడు, కుమార్తె కోట్లు దోచుకుతిన్నారని, ప్రభుత్వ శాఖల్లో కూడా కోట్లు మింగేశారని అన్నారు. వీటి అన్నిటిపై విచారణ జరిపించాలని కోరారు. ‘కే టాక్స్’ ఇష్యూ పక్కదోవ పట్టించడానికే టీడీపీ కార్యకర్తలపై దాడి అంటున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు