చంద్రబాబు మారారు అనుకున్నాం, కానీ..

17 Oct, 2017 14:10 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఎంపీ బుట్టా రేణుక ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారో కర్నూలు ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు. ఎలాంటి రాజకీయ చరిత్ర లేని బుట్టా రేణుకకు ఎంపీ టికెట్‌ ఇచ్చింది వైఎస్‌ఆర్‌ సీపీనే అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి అన్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే పని  చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

‘కర్నూలులో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చారని పార్టీ మారారా? లేక బలహీన వర్గాలకు చంద్రబాబు మేలు చేశారనా?. మీకు రూ.70 కోట్ల ప్యాకేజీ అందిందని ప్రజలంతా అనుకుంటున్నారు ...అందుకు మారారా? చంద్రబాబుకు రాజ్యాంగమన్నా, చట్టాలన్నా కనీస గౌరవం లేదు. ఎమ్మెల్యే, ఎంపీల కొనుగోలుపై చంద్రబాబు నోరు విప్పాలి. చంద్రబాబు రాజకీయ వ్యభిచారానికి మళ్లీ శ్రీకారం చుట్టారు. అందరు తిడుతుంటే చంద్రబాబు మారారు అనుకున్నాం, కానీ మారలేదు. జగనన్న చలవ వల్లే నేను ఎంపీగా గెలిచానన్న బుట్టా రేణుక ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని టీడీపీలో చేరారు.’ అని జోగి రమేష్‌ ప్రశ్నలు సంధించారు.

చంద్రబాబు రాజకీయ వ్యభిచారంపై జోగి రమేష్ వ్యాఖ్యలు 

మరిన్ని వార్తలు