‘కేఈకి ఆహ్వానం లేకపోవటం దారుణం!!’

31 Jan, 2019 18:39 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తికి రాజధానిలో జరిగే శ్రీవారి ఆలయ భూకర్షణ కార్యక్రమానికి ఆహ్వానం లేకపోవటం దారుణమని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కే పార్థసారధి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీ వర్గానికి చెందిన కేఈ క్రిష్ణమూర్తిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్దేశపూర్వకంగానే అవమానించారని పేర్కొన్నారు. దేవాదాయశాఖ మంత్రికి అధికారులు ఆహ్వానం ఇవ్వలేకపోవటం వెనుక సీఎం ఆదేశాలే కారణమని తెలిపారు.

గతంలో కూడా అమరావతి శంకుస్థాపన వేదికపై ఒక్క బీసీకి కూడా చోటు కల్పించలేదని మండిపడ్డారు. అమరావతి నిర్ణయాత్మక కమిటీలో కూడా రెవెన్యూ మంత్రిగా వున్న కేఈ క్రిష్ణమూర్తిని నియమించకుండా అవమానించారని చెప్పారు. బలహీన వర్గాలను చిన్నచూపు చూడటం మొదటి నుంచి సీఎం చంద్రబాబుకు అలవాటన్నారు. రానున్న ఎన్నికలలో బీసీలు చంద్రబాబుకు సరైన గుణపాఠం నేర్పుతారని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు