‘అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ము టీడీపీకి లేదు’

1 Jul, 2018 11:38 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్‌ రెడ్డి

సాక్షి, నెల్లూరు : దళితులకు చేసిన అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ము టీడీపీకి లేదని వైఎస్సార్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులో నిర్వహించిన దళిత తేజం కార్యక్రమానికి స్పందన లేదని కాకాణి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పదివేల మంది కూడా సభకు రాలేదని తెలిపారు. అందుకు ఆశ వర్కర్లు, అంగన్వాడీ, పొదుపు మహిళలను తీసుకువచ్చారని కాకాణి పేర్కొన్నారు. దళితులు ఎవరూ సీఎం చంద్రబాబును నమ్మడం లేదనడానికి ఇదే నిదర్శనమని వైఎస్సార్‌సీపీ నేత అన్నారు.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని విమర్శించే హక్కు టీడీపీ మంత్రి లోకేష్‌కు లేదని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌కు దివంగత నేత ఎన్‌టీఆర్‌ భారత రత్న ఇప్పించారని చంద్రబాబు చెప్పడం సరికాదని కాకాణి పేర్కొన్నారు. దేశానికి చేసిన సేవలతో రత్నంలా అంబేడ్కర్‌ ఎదిగారని కొనియాడారు. ఆయనకు ఎవరి సిఫారసు అక్కర్లేదన్నారు. సీఎం రమేష్‌ దీక్షపై అందరికి అనుమానాలున్నాయని కాకాణి తెలిపారు. రమేష్‌ది ఉక్కు దీక్ష కాదు.. తుక్కు దీక్ష అని టీడీపీ ఎంపీ  చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు