‘ఆయన లాంటి దద్దమ్మను ఎక్కడా చూడలేదు’

4 Aug, 2019 16:02 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా లాంటి చేతకాని దద్దమ్మను తాను ఎక్కడా చూడలేదని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు. అసత్యారోపణలు మానకుంటే మాజీ మంత్రి నాలుక కోస్తానంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై విరుచుకుపడ్డారు.  అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రాన్ని తండ్రీకొడుకులిద్దరూ దివాళా తీయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్పినా  ఆ ఇద్దరిలో మార్పు రావటం లేదన్నారు.  అర్ధం లేని ట్వీట్లతో లోకేష్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాలారిష్టాలని అధిగమించి ప్రజాసంక్షేమాన్ని చూస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు అభివృద్ధికి సహకరించకపోగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

మచిలీపట్నం పోర్టు వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అవినీతి రహిత రాష్ట్రం కోసం వైఎస్సార్‌ సీపీ ప్రయత్నిస్తుంటే నీతిలేని బాబు అవాకులు చవాకులు పేలుతున్నారని కోప్పడ్డారు. నిబంధనలకు విరుద్దంగా నవయుగకి పనులు కేటాయించి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.  చంద్రబాబు సృష్టించిన ఆర్ధిక సమస్యలనుంచి రాష్టాన్ని గాడిలో పెట్టేపనిలో ప్రభుత్వం ఉందన్నారు. లోకేష్ ఓ మాలోకంలా తయారయ్యాడంటూ ఎద్దేవా చేశారు.  అవకాశం ఉన్నచోటల్లా టీడీపీ పెద్దలు దోచేశారని,  ఆఖరికి పేదవాడి కోసం ఏర్పాటుచేసిన క్యాంటీన్ల పథకంలోనూ కాసులకక్కుర్తిని వదలలేదన్నారు. మొబైల్ క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదవాడి ఆకలి తీర్చే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు