‘ప్రత్యేక హోదా వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం’

27 Dec, 2018 12:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే శక్తి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే ఉందని ఆ పార్టీ మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ వల్లే చంద్రబాబు యూ టర్న్‌ తీసుకున్నారని తెలిపారు. హోదా కోసం జననేత వైఎస్‌ జగన్‌ అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. కేవలం పోలవరానికి ఒక్క గేటు పెట్టి చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వయస్సు పై బడ్డా టీడీపీ నాయకుడు జేసీ దివాకర్‌రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. దివాకర్‌రెడ్డి వైఎస్‌ జగన్‌ను విమర్శించి మన్నలను పొందాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌ను విమర్శిస్తున్నవారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

‘40 ఏళ్ల అనుభవం... అబద్ధాలు చెప్పడానికేనా’
వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశం పక్కబెట్టిన చంద్రబాబు హడావుడిగా శంకుస్థాపనలు చేస్తూ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణాల గ్రాఫిక్స్‌ చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై చీటింగ్‌ కేసు పెట్టాలని అన్నారు. నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. వైఎస్‌ జగన్‌పై అవాకులు, చవాకులు పేలుతున్న జేసీ దివాకర్‌రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. లేదంటే ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. బ్యాకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారికి చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు