‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వంచకుడు చంద్రబాబు’

29 Dec, 2018 13:47 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వంచకుడని మాజీ ఎమ్మెల్యే,  వైఎస్సార్‌ సీపీ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ విమర్శించారు. శనివారం ఆయన తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన విలే‍ఖరుల సమావేశంలో మాట్లాడుతూ..  రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రుల ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు.  కేంద్రంతో నాలుగేళ్లు బంధం కొనసాగించి.. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నాయకుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచిన నాయకుడని కొనియాడారు.  చంద్రబాబునాయుడు ధర్మ దీక్షల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

అర్బన్ హౌసింగ్ స్కీం అనేది పెద్ద స్కాం.. ఆ స్కీంలో జరుగుతున్న అవినీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రికి వాటా ఉందని ఆరోపించారు. ఆయన కనుసన్నలలోనే ఇదంతా నడుస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టి,  రాజీనామా చేసిన  త్యాగజనులు వైఎస్సార్‌ సీపీ పార్లమెంట్ సభ్యులంటూ పొగిడారు. బీరు హెల్త్ డ్రింక్ అని వ్యాఖ్యానించిన మంత్రి గారి సమర్థత ఏమిటో ప్రజలకు అర్థమౌతుందని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసిన తెలుగుదేశం పార్టీ వంచకులపై  వైఎస్సార్‌ సీపీ చేస్తున్న పోరాటమే వంచనదీక్ష అని అన్నారు.

మరిన్ని వార్తలు