‘హాయ్‌ ల్యాండ్‌ని దోచుకోవడానికి కుట్ర’

15 Dec, 2018 13:06 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి

విజయవాడ: టీడీపీ నాయకులు హ్యాయ్‌ ల్యాండ్‌ని దోచుకోవడానికి కుట్ర పన్నారనేది స్పష్టంగా కనిపిస్తోందని అగ్రిగోల్డ్‌ బాధిత బాసట కమిటీ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పి రెడ్డి విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో దాదాపు 20 లక్షల అగ్రిగోల్డ్‌ బాధితులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టినా చంద్రబాబు వైఖరిలో మార్పు రావడం లేదన్నారు. 260 మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నా ఎటువంటి స్పందన లేదని విమర్శించారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలు తీర్చడానికి వైఎస్సార్‌సీపీ ప్రత్యక్ష కార్యాచరణకి సిద్ధమవుతోందని, ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు.

రేపు(ఆదివారం) విజయవాడలో మరోసారి సమావేశం అయిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని, ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు కూడా హాజరవుతారని చెప్పారు. అగ్రిగోల్డ్‌ బాధితుల జాబితా ఇప్పటికీ ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు..బాధితులకు న్యాయం చేయాలన్నదే తమ ప్రయత్నమని వ్యాక్యానించారు. బహిరంగ మార్కెట్‌లో అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ రూ.10 వేల కోట్లు ఉన్నా ప్రభుత్వ చర్యలు మాత్రం బాధితులకు సహాయం చేసే విధంగా వెళ్లడం లేదన్నారు. 

బాబు అన్ని వర్గాలను మోసం చేశాడు: జంగా

చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసగించారని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారని చెప్పారు. అచ్చెన్నాయుడికి వైఎస్‌ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. బీసీలకు టీడీపీ చేసిందేమీ లేదన్నారు. ఈ నెల 20న అన్ని పార్లమెంటు కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

మరిన్ని వార్తలు