‘టీడీపీని మరోసారి నమ్మే ప్రసక్తేలేదు’

6 Feb, 2019 15:41 IST|Sakshi

సాక్షి, విజయనగరం : చంద్రబాబు ప్రభుత్వం విజయనగరం జిల్లాను అన్ని రంగాల్లో విస్మరించిదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భోగాపురం  విమానాశ్రయం కోసం రైతులు తమ విలువైన భూములను త్యాగం చేస్తే.. బడ్జెట్‌లో ఒక్క పైసా విమానాశ్రయానికి కేటాయించలేదని విమర్శించారు. నీటీ పారుదల ప్రాజెక్టుల విషయంల్లో ప్రచారమే తప్ప సాగునీటికి కేటాయింపుల్లేవన్నారు. జిల్లాలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరితే పట్టించుకోలేదని ఆరోపించారు.

గత ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. కేంద్రమంతిగా నాలుగునన్నరేళ్లు ఉండి హోదా కోసం మాట్లాడని అశోక్‌ గజపతిరాజు.. టెంట్ల కిందకు వెళ్లి పోరాడుతున్నామంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. టీడీపీ నాయకులని నమ్మి మరోసారి మోస పోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఐదేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి పాల్పడి..రాష్ట్రాన్ని అంధకారం చేశారని ఆరోపించారు. జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిన టీడీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు