‘ఓటమి భయంతో ఓట్లు తొలగిస్తున్నారు’

6 Mar, 2019 15:10 IST|Sakshi

సాక్షి, విజయనగరం : ప్రజాదారణ కోల్పోయిన టీడీపీ.. అక్రమార్గంలో గద్దెనెక్కాలనే ఉద్దేశంతో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రభుత్వ పనితీరుపై నమ్మకం లేదు కాబట్టే ఎదో కుట్ర చేసి అధికారంలోకి రావాలనుకుంటున్నారని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో టీడీపీ దారుణంగా ఓడిపోతుందన్న భయంతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఓట్లను తొలగిస్తూనే.. తమ సానుభూతి ఓట్లే తొలగిస్తున్నారని టీడీపీ చెబుతుంటే  దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు చెబుతున్న 7500 ఓట్లు ఎవరి సానుభూతిపరుల ఓట్లో ప్రజల ముందే తేల్చుకోవడానికి తాము సిద్ధమన్నారు. మంత్రికి దమ్ముంటే బొబ్బిలిలోని ప్రతి గ్రామానికి వెళ్లి నిజాన్ని తెలుసుకోవడానికి రావాలని సవాల్‌ చేశారు. 

ప్రభుత్వ దగ్గర ఉండాల్సిన పౌరుల సమాచారం ఓ ప్రైవేట్‌ కంపెనీ వద్దకు ఎలా వెళ్లిందో టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రెండు నెల క్రితం కొంత మంది వ్యక్తులు గ్రామాల్లో తిరుగుతూ.. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల వివరాలను తెలుసుకొని వారి ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల అధికారి, డీజీపీలకు ఫిర్యాదు చేశామన్నారు. గత 26వ తేది నుంచి చీపురుపల్లి, మెరకముడిదాం మండలాలలో 2వేలకు పైగా ఫాం7 ధరఖాస్తులు నమోదయ్యాయని, 27వ తేదికి అవి 7 వేలకు చేరాయన్నారు. ఇలా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 25వేల వరకు ఫాం7 నమోదయ్యాయన్నారు. ఇవన్ని కుట్ర పూరితంగా చేసిన ఫిర్యాదులేనన్నారు. ఫాం7 ధరఖాస్తులో నూటికి నూరు శాతం వైఎస్సార్‌సీపీ నానుభూతిపరుల ఓట్లే ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల వేళ టీడీపీ నేతలు ఎదో కుట్ర రూపంలో వస్తారని అంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు.

మరిన్ని వార్తలు