ఇప్పటికైనా సీబీఐ విచారణ చేయించాలి

8 Nov, 2018 11:11 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ నేత మళ్ల విజయ ప్రసాద్‌

విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ కోరితే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సిట్‌ చేత విచారణ చేపట్టారని, కానీ సిట్‌ నిజాలు బయట పెట్టకుండా అధికార పార్టీకి అనుకూలంగా నివేదిక ఇచ్చిందని వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం నగర అధ్యక్షులు మళ్ల విజయప్రసాద్‌ ఆరోపించారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రజల్ని మోసగించకుండా సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. భూ కుంభకోణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌ హస్తం ఉందని ఆరోపణలున్నాయని, కానీ సిట్‌ లోకేష్‌ పేరు తప్పించడంతో అనేక అనుమానాలు తలెత్తున్నాయని వ్యాక్యానించారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే భూకుంభకోణంపై రీ ఎంక్వైరీ వేస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే సీఎం అవహేళన చేస్తూ మాట్లాడటం జుగుప్సాకరంగా ఉందన్నారు. టీడీపీ నాలుగున్నర సంవత్సరాల పాలన అక్రమాల పుట్టగా సాగిందని, నిజాయతీ ఉంటే సీఎం తన పాలనపై సీబీఐ విచారణ కోరాలని సవాల్‌ విసిరారు.
 

మరిన్ని వార్తలు