-

పోలవరం ప్రాజెక్టు ఒక దోపిడి కార్యక్రమం : నాగిరెడ్డి

11 Aug, 2018 17:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఎప్పుడున్నా తీవ్ర కరువు వస్తుందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌ కేంద్ర కార్యలయంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో కరువు తీవ్రంగా ఉందని, వర్షపాతం మైనస్‌లో నమోదయిందని అన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అసలు సరిగ్గా వర్షాలే కురవలేదని తెలిపారు.  కరువు మండలాల ప్రకటనలో కూడా వంచన చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా తప్పుడు లెక్కలు చెబుతున్నారని అన్నారు. కరువు మండలాలకు లాభం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

రెయిన్ గన్ పేరుతో  టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దోపిడీ చేశారని ఆరోపించారు. పట్టిసీమ నీళ్లు కృష్ణ డెల్టాకే సరిపోవని, రాయలసీమను పట్టి సీమతో సస్యశ్యామలం  చేస్తామని అబద్దపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవ విషయాలని రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా దోపిడి కార్యక్రమం చేపడుతున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమను కరువు ప్రాంతంగా ప్రకటించి స్పెషల్‌ ప్యాకేజి ఇవ్వాలన్నారు. వ్యవసాయ శాఖ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు