‘పవన్‌.. ఆ టీఆర్‌ఎస్‌ నేతలు ఎవరో చెప్పు..’

12 Jan, 2019 15:45 IST|Sakshi

సాక్షి, విజయవాడ :  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలవమని చెప్పిన టీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరో తెలియ చేయాలని వైఎస్సార్‌ సీపీ నేత పార్ధసారథి కోరారు. పవన్‌కు వైఎస్సార్‌ సీపీతో కలిసి పనిచేయాలన్న కోరిక ఉన్నట్లు ఉందని, అందుకే అలా మాట్లాడుతున్నారని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. ఎవరి సహకారం తమకు అవసరం లేదని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసికంగా ఓటమికి సిద్దమైనట్లు ఉన్నారని, అందుకనే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపడతానన్న పధకాలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల స్టంట్‌లో భాగంగా చంద్రబాబు అనేక శంఖుస్థాపనలు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రం ఆర్ధికంగా దివాలా తీసే స్థితిలో ఉందని అన్నారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్‌ఐఏకు అప్పగిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ కేసును న్యాయస్ధానం ఎన్‌ఐఏకు అప్పగించిందన్నారు.

>
మరిన్ని వార్తలు