‘ఆయన తీరు దొంగే.. దొంగ అన్నట్లుగా ఉంది’

4 Mar, 2019 14:18 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరు దొంగే.. దొంగ అన్నట్లుగా ఉందని వైఎస్సార్‌ సీపీ నేత పార్థసారధి ఎద్దేవా చేశారు. అభివృద్ధిని అడ్డుపెట్టుకుని డేటా చోరీ చేయటం దురదృష్టకరమన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ రంగాన్ని చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్నారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వమే స్వార్థం కోసం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్‌ సంస్థల చేతుల్లో పెట్టిందని ఆరోపించారు. చంద్రబాబు తన అనుభవంతో లక్షల కోట్లు లూటీ చేయడానికి ప్రయత్నించారని మండిపడ్డారు.

ప్రతి రంగంలో అభివృద్ధి పేరు చెప్పి తన వాటాను ముందే లెక్కవేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు అవసరం వచ్చినపుడే హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అన్న విషయం గుర్తుకువస్తుందన్నారు. ఓట్లుకు కోట్లు కేసులో తప్పు చేయలేదని చెప్పకుండా.. నాకూ ఏసీబీ ఉంది.. నాకు పోలీసులు ఉన్నారంటూ చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో ఓటర్ల లిస్ట్‌ దగ్గర నుంచి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా చేస్తున్నారన్నారు. ఐటీ శాఖను తన కొడుకు చేతిలో పెట్టి ఓట్లు మాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ట్యాబుల్లో ప్రజల వ్యక్తిగత సమాచారం ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. దమ్ముంటే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కోవాలని సవాల్‌ విసిరారు.

మరిన్ని వార్తలు