-

టీడీపీ డ్రామాలు ప్రజలు నమ్మరు

8 Mar, 2018 13:18 IST|Sakshi
రెడ్డి శాంతి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి

శ్రీకాకుళం అర్బన్‌: ఆంధ్ర ప్రజల హక్కు అయిన ప్రత్యేకహోదా ఉద్యమసెగ పార్లమెంట్‌ను తాకిందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి అన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విభజనతో కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి హోదా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. సీఎం చంద్రబాబు స్వలాభం కోసం ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రం వద్ద మోకరిల్లారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ప్రత్యేకహోదా కోసం టీడీపీ మాట్లాడలేదని, హోదా ఉద్యమం తీవ్రరూపం దాల్చి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం  కావడంతో ఇపుడు ప్రత్యేకహోదా అంటూ కొత్తపల్లవి అందుకుందన్నారు. టీడీపీ డ్రామాలు ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమించిన ప్రతిసారీ పోలీసు యంత్రాంగంతో అణచివేసేందుకు కుట్రలు పన్నిందన్నారు. ప్రత్యేకహోదా విషయంలో ఇప్పటికైనా టీడీపీ తన స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలన్నారు. ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీ మద్దతు ప్రకటించాలన్నారు. లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు