‘ఆపరేషన్‌ గరుడ సృష్టికర్త చంద్రబాబే’

30 Oct, 2018 11:37 IST|Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌పై వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు నిప్పులు చెరిగారు. రాజేంద్రప్రసాద్‌ అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై ఆయన కుటుంబ సభ్యులే హత్యాయత్నం చేశారని చెప్పడానికి రాజ్రేంద్రప్రసాద్‌కు సిగ్గుండాలన్నారు. దమ్ముంటే ఆయన చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రచారం కోసమే దాడి చేయించుకున్నారంటూ టీడీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేసున్నారని విమర్శించారు.

కుట్రపూరితమైన రాజకీయ లక్ష్యంతోనే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని అంతమొందించేందుకు చంద్రబాబు నాయుడు పథకాలు రచించారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే టీడీపీ హత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఇదంతా చూస్తుంటే వైస్సార్‌ మరణం వెనుక కూడా కుట్రలు ఉన్నాయేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు.

ఆపరేషన్‌ గరుడ సృష్టికర్త చంద్రబాబేనని ఆరోపించారు. శివాజీని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్‌ చేయలేదో చెప్పాలన్నారు.శివాజీని విచారిస్తే ఎక్కడ నిజాలు బటటపడుతాయోనని చంద్రబాబు భయపడుతున్నారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రను ఆపడం కోసమే చంద్రబాబు కుట్ర పన్నారని దానిలో ఒక ఎస్సీ యువకుడిని భాగం చేశారన్నారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో చంద్రబాబే మొదటి ముద్దాయి అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో దర్యాప్తు చేయిస్తే అసలు నిజాలు బయటపడతాయని సుధాకర్‌ బాబు పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు