‘జగన్‌కు జనాదరణ చూడలేకే ఇలా చేస్తున్నారు’

15 Dec, 2018 16:19 IST|Sakshi

సాక్షి, ఆముదాలవలస: ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణను ఓర్వలేక టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుటుంబంపై చేస్తున్ననిరాధార ఆరోపణలు మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఆముదాలవలస బహిరంగ సభలో వైఎస్‌ జగన్ అసత్యాలు మాట్లాడారన్న ప్రభుత్వ విప్ కూన రవి వ్యాఖ్యలను తమ్మినేని ఖండించారు.

‘సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. టీడీపీ నాయకులు మా నాయకుడిపై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలే. అందుకే న్యాయదేవత ముందు ధైర్యంగా నిలబడగలుగుతున్నాం. దైర్యముంటే కూన రవి  అక్రమాలపై విచారణ జరిపించాలి. ముఖ్యమంత్రి బహిరంగ విచారణకు రావాలి. టీడీపీ నేతల ఆరోపణలపై చర్చించడానికి మేము సిద్దం. ల్యాండ్‌ మాఫియా, స్యాండ్‌ మాఫియా చేసిన చరిత్ర తెలుగుదేశం నేతలది. వెన్నెల వలసలో త్రిపుల్ ఐటీకి 50 ఎకరాల స్థలం లేదన్న కూన రవి.. పూల సాగుకు కోసం 99 ఎకరాలు కేటాయించడానికి ఎలా ప్రతిపాదన చేసారు’ అని తమ్మినేని సూటిగా  ప్రశ్నించారు. ఆముదాలవలస నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు