వైఎస్ఆర్సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం విమర్శ
ఫిరాయింపుదారులను కాపాడుతూ స్పీకర్ కోడెల దిగజారి ప్రవర్తిస్తున్నారు
సాక్షి, శ్రీకాకుళం: ఫిరాయింపులతో ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయకుండా ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్న కోడెల శివప్రసాదరావు శాసనసభ చరిత్రలో కళంకిత స్పీకర్గా నిలిచిపోతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం విమర్శించారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడమే గాకుండా వారిని సీఎం చంద్రబాబు కేబినెట్లోనూ చేర్చుకొని ప్రజాస్వామ్య విలువలను మంటగలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెడధోరణులను నిరసిస్తూ, ఆ మంత్రులను బర్తరఫ్ చేసేవరకూ శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని తమ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. ప్రలోభాలకు లొంగిపోయి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తాము చేసిన పనికి అభివృద్ధి ముసుగేయడం దారుణమన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కోడెలకు ఎన్నోమార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఇంత జరిగినా ఇప్పుడు శాసనసభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 66 మంది అని ప్రకటించడం గమనార్హమన్నారు. కోడెల కన్నా ముందు ఎంతోమంది స్పీకర్లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి ఆ పదవికే వన్నె తెచ్చారని చెప్పారు. వారికి భిన్నంగా కోడెల దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే ఫిరాయింపు చట్టంపై మీడియా ముందు చర్చకు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు.