ఆ వీడియోలోని చింతమనేని వ్యాఖ్యలు బాధ కలిగించాయి

25 Feb, 2019 16:38 IST|Sakshi

సాక్షి, ఏలూరు : దళితులపై అసభ్యకరంగా మాట్లాడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకురాలు తానేటి వనిత డిమాండ్‌ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై చింతమనేని చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయన్నారు. దళితులపై ‘దేహి’ లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చింతమనేని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. అధికారులపై సైతం చింతమనేని దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. చింతమనేని అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయన్నారు. కొవ్వూరు పోలీసు స్టేషన్‌లో చింతమనేని వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకోలేదని ఆరోపించారు. (మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు)

చింతమని వ్యాఖ్యలు మార్ఫింగ్‌ చేశారని సీఎం చంద్రబాబు నాయుడు అనడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దళితులను కేవలం ఓట్ల కోసమే చూస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబునాయుడు దళితులను హీనంగా చూస్తున్నారన్నారు. దళితుల ఇంట్లో ఎవరైనా పుడతారా అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడమే దీనికి నిదర్శనం అన్నారు. దళితులపై అనుచిన వ్యాఖ్యలు చేసి తర్వాత క్షమాపణలు కోరడం సరికాదన్నారు. అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి.. బహిరంగంగా చింతమనేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని దళితులంతా ఏకతాటిపైకి వచ్చి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గెలిపించాలని కోరారు.

మరిన్ని వార్తలు