కేంద్రమంత్రిని చేయడం వల్లే వేల కోట్ల అవినీతి

25 Nov, 2018 11:26 IST|Sakshi

శ్రీకాకుళం: టీడీపీ ఎంపీ, ఆర్ధిక నేరగాడు  సుజనా చౌదరీ మీద ఇప్పటికే చర్యలు తీసుకుని ఉండాల్సిందని, కేంద్ర మంత్రిని చేసి కాపాడటం వల్లనే వేల కోట్ల రూపాయల అవినీతికి ఎగబాకాడని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం వ్యాక్యానించారు. శ్రీకాకుళంలో తమ్మినేని విలేకరులతో మాట్లాడుతూ..సుజానా చౌదరీ ఆర్ధిక నేరాలు చేసి ఆ డబ్బును చంద్రబాబుకు అందజేశారని ఆరోపించారు. ఆ డబ్బుతోనే గత ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుపెట్టి ఓట్లు కొన్నారని చెప్పారు. ఆర్ధిక నేరగాళ్ల మీద ఐటీ దాడులు జరుగుతుంటే ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

ఈ ఆర్ధిక నేరాల్లో అసలు సిసలైన గజదొంగ చంద్రబాబేనని, అందుకే చంద్రబాబు తుళ్లిపడుతున్నారని అన్నారు. ఆర్ధిక నేరాల మూలాలన్నీ చంద్రబాబు వద్దకే చేరతాయని ఆరోపించారు. ఆర్ధిక నేరాలు బయటపడతాయనే కారణంతోనే ముందస్తుగా జాతీయ పార్టీ అండ కోసం కాంగ్రెస్‌ పంచన చేరారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో చంద్రబాబు తన మనవడు దేవాన్ష్‌ పేరిట పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు. పసిపిల్లలకు కూడా ఉగ్గుపాలతో అవినీతి నేర్పుతున్నారని చంద్రబాబు నుద్దేశించి తీవ్రంగా మండిపడ్డారు. రెండు వేల రూపాయల నోట్లు కూడా రద్దు చేస్తే, వచ్చే ఎన్నికల్లో అవినీతి సొమ్ము కట్టడి అవుతుందని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు