మంత్రి ఉమా స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నారు!

21 Feb, 2019 15:45 IST|Sakshi

ఆయనకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

వైఎస్సార్‌సీపీ నేత వసంత్‌ కృష్ణప్రసాద్‌

సాక్షి, విజయవాడ : ఎన్నికల ముందు తాయిలాలతో ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మైలవరం  సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్‌ విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు కొత్తగా మరో మేనిఫెస్టో కమిటీ అంటూ కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. కంత్రి మంత్రి దేవినేని ఉమా తనస్థాయి మరచి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని, దాసరి జైరమేశ్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని పేర్కొన్నారు.

టీడీపీలో రాముడి సంతతి పోయి రావణ సంతతి వచ్చిందని, టీడీపీలో అందరూ రావణులే మిగిలారని కృష్ణప్రసాద్‌ మండిపడ్డారు. మంత్రి ఉమా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏం చేయలేదని, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏదో చేసినట్టు ఆయన హడావిడి చేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ళు మంత్రిగా ఉండి పేదలకు పట్టాలు ఇవ్వకుండా.. ఉమా ఇప్పుడు హడావిడి చేస్తున్నారని, ఆయన ఓటమి తప్పదని పేర్కొన్నారు. మంత్రి ఉమాకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. మహిళలకు సంబంధించిన డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఎన్నికల్లో బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు.

మరిన్ని వార్తలు