సాక్షి, హైదరాబాద్ : వైఎస్ వివేకానంద రెడ్డి మృతి పలు అనుమానాలకు తావిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడే మహా కుట్రకు బీజం పడిందని ఆరోపించారు. ‘కడపను కొట్టి తీరతామని టీడీపీ నేతలు చాలా సార్లు మాట్లాడారు. పులివెందులను కూడా గెలుస్తామని టీడీపీ మంత్రులు పదే పదే చెప్పారు. టీడీపీ మంత్రులు, నేతలు చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేమిటి’ అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారో వైఎస్సార్ జిల్లా ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు.
వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత
సీబీఐ విచారణ జరిపించాలి..
‘నిన్నంతా వైఎస్ వివేకానంద రెడ్డి జమ్మలమడుగు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మలమడుగు ఇంచార్జిగా ఉన్న వివేకానంద రెడ్డి మరణంపై కూలంకషంగా విచారణ జరగాలి. సిట్తో నిజానిజాలు బయటకొస్తాయనే నమ్మకం మాకు లేదు. కంటితుడుపు దర్యాప్తు కాకుండా.. అదే విధంగా వాస్తవాలు బయటికి రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలి’ అని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.