టీడీపీ నేతలపై విజయసాయిరెడ్డి విమర్శలు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నన్నాళ్లు పోలీసులను పచ్చ పార్టీ నేతలుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పచ్చ నేతల అవినీతిని బయటపెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐతో దర్యాప్తు చేయిస్తున్నారని వెల్లడించారు. ‘మీ పాలనలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్వం చేసి పోలీసులకు పచ్చ యూనిఫాం తొడిగించారు. అందుకే వైఎస్ జగన్ గారు నాడు సీబీఐ దర్యాప్తు కోసం డిమాండు చేశారు. ఇప్పుడు పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. డౌట్ ఉంటే శాంపిల్గా కోడెల కుటుంబం కేసులను సీబీఐకి అప్పగించమని అడగొచ్చుగా చంద్రబాబు గారూ’ అని అన్నారు.
(చదవండి : కొంపముంచిన కోడెల.. పల్నాడులో టీడీపీ పతనం)
‘పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు. లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించే ధ్యాసంతా. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టించి అనుకూల మీడియాతో అలజడి లేపాలని చూస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి నారా చంద్రబాబు, లోకేష్ చేసింది అదే కదా’ అని ట్వీట్ చేశారు.