కాల్‌ సెంటర్‌లతో ఐటీ ఉద్యోగాలా? 

28 Sep, 2018 20:35 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు

కృష్ణా జిల్లా: ఐటీ కంపెనీకి కాల్‌ సెంటర్‌కు తేడా తెలియని మంత్రి నారా లోకేష్‌ అని వైఎస్సార్‌సీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఎద్దేవా చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. కాల్‌ సెంటర్‌లను ప్రారంభించి లక్ష ఉద్యోగాలు ఇస్తానని మంత్రి లోకేష్‌ అనడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. కాల్‌సెంటర్‌లో ఐటీ ఉద్యోగాలు ఎలా ఇస్తాడో లోకేష్‌ బాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఐటీ అనుభవం ఉన్న తాను అవసరమైతే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు.  ఐటీ విభాగంలో అనుభవం ఉన్న తాను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అమెరికా నుంచి మీ ముందుకు వచ్చానని చెప్పారు.

టీడీపీ ఎమ్మెల్యేల మాదిరి మట్టి, ఇసుక వంటి అవినీతి పనులు చేయనని వెల్లడించారు. జగనన్న నేతృత్వంలో నియోజకవర్గ ప్రజలకు అవినీతి రహిత పాలనను అందిస్తానని వివరించారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంఘీభావ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని అన్నారు. ఈ రాష్ట్రానికి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని సీఎం చేయాల్సిన అవసరం ఉందని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి అయిన సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో సంఘీభావ పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మాదు శివరామకృష్ణ, దేవగిరి ఓంకార్ రెడ్డి ,యర్కారెడ్డి నాగిరెడ్డి, రామిశెట్టి వెంకటేశ్వరరావు, నక్కా గాంధీ, ఎండీ గౌసాని, బడుగు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు