టీడీపీ గొడవలు సృష్టించేందుకు కుట్రలు: వైఎస్సార్ సీపీ

18 May, 2019 13:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్‌ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్ సీపీ నేతలు కోరారు. ఈ మేరకు పార్టీ నేతల బృందం శనివారం సీఈసీని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కౌంటింగ్‌ ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, చంద్రగిరి పరిధిలో రీ పోలింగ్‌ సజావుగా జరిగేలా చూడాలని  సీఈసీని కోరినట్లు తెలిపారు.

చదవండి: ఈసీని కలిసిన వైఎస్సార్ సీపీ నేతల బృందం

‘చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు చేస్తున్న అరాచకాలను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాం. తన పేషీలో పనిచేసిన అధికారిని కలెక్టర్‌గా నియమించుకొని అరాచకాలు చేస్తున్నారు. ఏప్రిల్‌11న ఎన్నికలు పూర్తి అయిన తరువాత 12వ తేదీ మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏడు పోలింగ్‌ బూత్‌లపై ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌తో టీడీపీ నేతలు కుమ్మక్కై దళితులను ఎన్నికల్లో పాల్గొనకుండా చూశారు. టీడీపీ బటన్‌కు నొక్కి అన్ని ఓట్లు కూడా వేయించుకున్నారు. దానిపై విచారణ చేయించి పీవోను నిజంగా కలెక్టర్‌ బెదిరించారు. అతను ప్రాణభయంతో రిగ్గింగ్‌ జరగలేదని కలెక్టర్‌ రాయించారు. ఒక్కసారి సీసీ పుటేజ్‌ చూడాలని కోరినా ఆయన తోసిపుచ్చారు. 

సీఈవోకు ఫిర్యాదు చేయడంతో అందరూ కూడా సీసీ పుటేజ్‌ చూసి ప్రజాస్వామ్య చరిత్రలో ఇంతటి దుర్మార్గం ఎక్కడ జరిగి ఉండదని విస్మయం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో కూడా ఈ ఐదు పోలింగ్‌ బూత్‌ల్లో కూడా అన్ని టీడీపీకే ఓట్లు పడ్డాయి. ఒక్క ఓటు కూడా ఏ రాజకీయ పార్టీకి పడలేదు. ప్రణాళిక బద్ధంగా ఇలా చేస్తున్నారు. కలెక్టర్‌ ప్రద్యూమ్న మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాం. దళితుల్లో ఎవరైనా పుట్టాలా అని హీనంగా మాట్లాడిన చంద్రబాబు..దళితులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు దళిత ద్రోహిగా ముద్రపడ్డారు. వివిధ అంశాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. మాక్‌ పోలింగ్‌ జరిగినప్పుడు ఈవీఎంలు అన్నీ కూడా క్లియర్‌ చేస్తారు. వీవీప్యాడ్‌లలో ఎక్కువ ఓట్లు వస్తాయి. దీనిపై ఒక స్పష్టత ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను కోరాం. 

రాప్తాడు నియోజకవర్గంలోని రిటర్నింగ్‌ అధికారి మంత్రి పరిటాల సునీతకు తొత్తుగా పని చేస్తున్నారన్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఆమెను కౌంటింగ్‌ విధుల నుంచి తొలగించాలని కోరాం. టీడీపీలో గుండాలను, రౌడీలను పోలింగ్‌ కౌంటింగ్‌ ఏజెంట్లుగా నియమించారు. వీరు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కుట్రలు చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాం. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో కూడా ఫిర్యాదు చేశాం. చాలా కేసుల్లో ఓరిజినల్‌గా ఉన్న పోలింగ్‌ స్టేషన్లలో ఓట్లు వేశారు. మరికొందరు డుప్లికేట్‌ ఓట్లు వేశారు. ఈ విషయాలన్నీ కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఏపీ పోలీసులను కాకుండా సెంట్రల్‌ పోలీసులను నియమించాలని, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను, ఆర్‌వోను కౌంటింగ్‌ విధుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశాం.’  అని విజయసాయి రెడ్డి తెలిపారు.

చంద్రబాబుకు పదవి లేనిదే జీవితం గడవదు:  మేకపాటి
చంద్రబాబుకు అధికారం లేనిదే ఆయన జీవితం గడిచే పరిస్థితి లేదు. అందుకే ఎలాగైనా గెలవాలనే కుట్రలు చేస్తున్నారు. కౌంటింగ్‌ రోజు గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. కౌంటింగ్‌ శాంతియుతంగా జరిగేలా చూడాలని మేం సీఈసీని కోరామని మేకపాటి రాజమోహన్‌ రెడ్డి తెలిపారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
రీపోలింగ్‌కు గట్టి భద్రత ఏర్పాటు చేయాలని చెప్పాం

మరిన్ని వార్తలు