‘సీఎం కనుసన్నల్లోనే ఆపరేషన్‌ గరుడ’

29 Oct, 2018 12:20 IST|Sakshi

నగర పోలీస్‌ కమిషనర్‌కు వైఎస్సార్‌ సీపీ నేతల ఫిర్యాదు

సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు నాయడు కనుసన్నల్లోనే ఆపరేషన్‌ గరుడ జరుగుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, గౌతంరెడ్డిలు ఆరోపించారు. ఆపరేషన్ గరుడ కుట్రదారుడైన నటుడు శివాజీపై చర్య తీసుకోవాలంటూ వారు సోమవారం నగర పోలీస్ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నటుడు శివాజీ చౌదరిని ఉపయోగించి చంద్రబాబు ఈ కుట్ర కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కూడా ఆ కుట్రలో భాగమేనన్నారు. కత్తితో హత్యకు ప్రయత్నించిన శ్రీనివాస్‌తో పాటు చంద్రబాబు, శివాజీ చౌదరిలను విచారించాలని డిమాండ్‌ చేశారు. శివాజీ చౌదరి గరుడ పురాణం చెప్పడం... శ్రీనివాసరావు హత్యాయత్నం చేయడం.. శివాజీ ముందే చెప్పాడంటూ చంద్రబాబు సమర్ధించడం కుట్ర అనేందుకు నిదర్శనమన్నారు. గరుడ కుట్ర పేరుతో మాట్లాడుతున్న శివాజీ చౌదరిపై తక్షణమే కేసు నమోదు చేయాలని నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. శివాజీకి ముందస్తుగా ఈ సమాచారం ఎలా వచ్చిందని, ఈ సమాచారం అందించిన వారు ఎవరో బయట పెట్టాలన్నారు.

>
మరిన్ని వార్తలు