‘మనీ మేనేజ్‌మెంట్‌తో గెలవలేమని గ్రహించాలి’

12 Dec, 2018 16:52 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అరాచక పాలనకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలు నేనున్నానంటూ భరోసానివ్వడానికి వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతిరోజు పార్టీ కార్యకర్తలు, ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజాసంకల్పయాత్రలో పాల్గొంటూ జననేతకు బాసటగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం వైఎస్సార్‌ సీపీ విజయవాడ పార్లమెంట్‌ సమన్వయకర్త ఇక్బాల్‌ ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్బాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోల్‌ మేనేజ్‌మెంట్‌, మనీ మేనేజ్‌మెంట్‌ ద్వారా ఎన్నికల్లో గెలవలేమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రహించాలన్నారు. ఏపీలో ప్రజలు చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు, అమరావతి నిర్మాణంపై ప్రచారం తప్ప అమలు కనిపించడం లేదని పేర్కొన్నారు. 

వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఆమదాలవలస షుగర్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తానని ప్రకటించిన జననేతకు ఆయన రైతులు తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైనందుకే.. ప్రజలు వైఎస్‌ జగన్‌ వద్దకు పోటెత్తుతున్నారని అన్నారు. తిత్లీ తుపాను ప్రభావ ప్రాంతాల్లో జరుగుతున్న అవినీతి వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రలో బయటపడనుందని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు