చంద్రబాబు మౌనంగా ఉన్నారెందుకు?

12 Feb, 2018 19:54 IST|Sakshi
ధర్మాన ప్రసాదరావు, వరప్రసాద్‌, కిలివేటి సంజీవయ్య

వైఎస్సార్‌సీపీ నాయకుల ప్రశ్న

సాక్షి, నెల్లూరు: విభజన హామీల సాధనలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని వైఎస్సార్‌ సీపీ నాయకులు విమర్శించారు. స్వప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దకొండూరులో జరుగుతున్న కీలక సమావేశానికి వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. భేటీకి ముందు వారు ‘సాక్షి’ టీవీతో మాట్లాడారు.

డ్రామాలేంటి బాబు: ధర్మాన ప్రసాదరావు
‘కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ఆయన వల్లే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టింది. విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రంపై చంద్రబాబు ఎందుకు ఒత్తిడి తేవడం లేదు? కేంద్ర ప్రభుత్వంలో ఉండి డ్రామాలేంటి? రాష్ట్రానికి అన్యాయం చేసి సంబరాలు చేసుకోవడమేం‍టి? ప్రజల ఆగ్రహం నుంచి బయటపడేందుకు డ్రామాకు తెర లేపారు’

తేడా ఉంది: ఎంపీ వరప్రసాద్‌
‘ప్రత్యేక హోదాకు, ప్యాకేజీకి చాలా తేడా ఉంది. హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం. ప్యాకేజీతో ఒరిగేదేమీ ఉండదు. ప్యాకేజీతో చంద్రబాబుకు మేలు జరుగుతుంది. ప్రజలకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుంది. హోదాకోసం మేం నాలుగేళ్లుగా పోరాడుతున్నాం. జగన్‌ నిరవధిక నిరాహార దీక్ష చేశారు. హోదా సహా విభజన హామీలన్నీ అమలు చేయాలి. అప్పటివరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుంది’

ఇంకెన్నాళ్లు మోసం: ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
‘కేసు భయంతోనే కేంద్రానికి చంద్రబాబు భయపడుతున్నారు. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటారా? ఇంకెన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారు? నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో ఉండి సాధించిందేంటి? ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారు’

మరిన్ని వార్తలు