అందుకే టీడీపీకి 23 సీట్లు వచ్చాయి: అంబటి

10 Aug, 2019 14:47 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆశా వర్కర్లకు సంబంధించి చంద్రబాబు చేసిన ట్వీట్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు అబద్దాలు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని, ఇంతవరకు చేసిన అబద్దపు ప్రచారాల వల్లే టీడీపీకి 23 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను మెచ్చుకోకున్నా ఫర్వాలేదు గానీ.. ప్రభుత్వంపై అనవసరంగా బురద చల్లవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలిచ్చే ఆవు కాదని, రక్తాన్ని పీల్చే జలగ అని విమర్శించారు. తమ దేశంలో చంద్రబాబులా మాట్లాడితే మెంటల్‌ ఆసుపత్రిలో వేస్తారని స్విట్జర్లాండ్‌ మంత్రి ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు.

కాగా 2011లో వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని, ఎన్నో కష్టాలను ఓర్చుకున్న యోధుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో  చంద్రబాబు  23 మందిని కొనుగోలు చేసి వైఎస్సార్‌ సీపీని లేకుండా అంతం చేస్తానని బెదిరించారన్నారు. అయితే జగన్‌.. వెనకడుగు వేయకుండా పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారని తెలిపారు. ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చి కనుమరుగైపోయినా.. వైఎస్సార్‌ సీపీ మాత్రం వెనుతిరగలేదని, జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఉండటమే ఇందుకు కారణమని స్పష్టం చేశారు. 2017లో తెలంగాణలో జరిగిన ఆందోళనలో ఫోటో పెట్టి అబద్దాలు చెప్పారని, బందరు పోర్టు తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

>
మరిన్ని వార్తలు