‘ఫౌండేషన్‌ పేరుతో కోట్లు దోచేశారు’

30 Nov, 2019 08:10 IST|Sakshi

సాక్షి, తుని(తూర్పుగోదావరి): నమ్మి ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తులైన కోన ప్రాంత టీడీపీ నేతలు యనమల ఫౌండేషన్‌కు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్‌) నిధులను దుర్వనియోగం చేశారని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శించారు. కోన ప్రాంతం పెరుమాళ్లపురం పంచాయతీ తలపంటిపేట గ్రామంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ఖర్చు చేసే సీఎస్‌ఆర్‌ నిధులను ఫౌండేషన్‌ను మళ్లించుకుని జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. వివిధ కంపెనీలు స్థానికంగా ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం రెండు శాతం నిధులను సీఎస్‌ఆర్‌ నిధులుగా కేటాయిస్తాయన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ నిధులను యనమల ఫౌండేషన్‌కు మళ్లించుకుని, పిల్లలకు పెన్సిళ్లు, బ్యాగులు ఇచ్చి విస్తృత ప్రచారం చేసుకున్నారని అన్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు చూపించి రూ.కోట్లు దోచుకున్నారని విమర్శించారు.

టీడీపీ అధికారంలోకి రాకముందు ఈ ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు తీరప్రాంత డ్రైనేజీ సమస్యపై అప్పట్లో ధర్నా చేసి హడావుడి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ తరువాత టీడీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నా డ్రైనేజీ సమస్యను పట్టించుకోలేదన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న ఈ ప్రాంత నేత కూడా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం డెంగీ, వైరల్‌ జ్వరాలకు నిలయంగా మారిందన్నారు. ఏడాదిలోగా జమ్మేరు కాలువల ఆధునికీకరణ చేసి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే అన్నారు. పెరుమాళ్ల పురంలో డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించడంతోపాటు మండలానికి పీజీ, జూనియర్‌ కళాశాల మంజూరుకు కృషి చేస్తానన్నారు. తొండంగి మండలంలోని అత్యధికంగా పూరి గుడిసెలు ఉన్నాయన్నారు. పార్టీ, కుల, మత వర్గ బేధం లేకుండా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మిస్తామన్నారు.   

సున్నా వడ్డీ రుణాల పంపిణీ 
అనంతరం డ్వాక్రా మహిళల సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు రూ.3.20 కోట్ల చెక్కును మండల మహిళా సంఘానికి అందజేశారు. తొలుత పంపాదిపేట, బుచ్చియ్యపేట గ్రామాల్లో గ్రామ సచివాలయాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.  

రబీ సాగునీటి విడుదలకు చర్యలు  
పంపా, కోదాడ ఉప్పు చెరువు ఆయకట్టు పరిధిలో ఈ ఏడాది రబీ సాగుకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే రాజా విలేకరులకు తెలిపారు. పంపా ఆయకట్టు పరిధిలో 12 వేల ఎకరాలకు 1.03 టీఎంసీల నీరు అవసరమన్నారు. ప్రస్తుతం పంపాలో 0.23 టీఎంసీల నీరు ఉందన్నారు. ఏలేరు జలాలను మళ్లించేందుకు కలెక్టర్, జిల్లా ఇరిగేషన్‌ అధికారులతోపాటు విశాఖ జిల్లా ఇరిగేషన్‌ అధికారులతో చర్చించినట్టు తెలిపారు. నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉన్నందున ఏడు వేల ఎకరాలకు పూర్తి స్థాయిలో నీరందించేందుకు కృషి చేస్తామన్నారు. పిఠాపురం బ్రాంచి కెనాల్‌ ద్వారా కోదాడ ఉప్పు చెరువు ఆయకట్టు పొలాలకు రబీ సాగుకు నీరందిస్తామన్నారు. సభలో ఎమ్మెల్యే రాజాను పార్టీ నాయకులు, విద్యార్థులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొయ్యా మురళి, పార్టీ మండల కనీ్వనర్‌ బత్తుల వీరబాబు, మండల యూత్‌ కనీ్వనర్‌ ఆరుమిల్లి ఏసుబాబు చౌదరి, యాదాల రాజబాబు, మత్స్యకార నాయకులు మేరుగు ఆనందహరి, చొక్కా కాశీ, పెరుమాళ్ల లోవరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంగుళూరి అరుణ్‌కుమార్, మండలంలోని ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు