పల్నాడు అరాచకాలపై చర్చకు సిద్ధం : గోపిరెడ్డి

4 Sep, 2019 15:12 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడ్డారని నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు దిగారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడులో జరిగిన అరాచకాలపై చర్ఛకు తాము సిద్దమని, చంద్రబాబుకు ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్‌ చేశారు. సత్తనపల్లి, నరసరావు పేటలో ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారో ప్రజలు మరిచిపోలేదన్నారు. పల్నాడు ప్రాంతంలో ఎవరు తప్పుడు కేసులు పెట్టారో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతలు మైనింగ్‌ మాఫియాగా మారి గనులను దోచుకున్నారని ఆరోపించారు. సత్తెనపల్లి, నరసరావు పేటలో కోడెల చేసిన అరాచకాలు అన్ని ఇన్నీ కాదన్నారు. ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి దాడులకు పాల్పడ్డారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతలను గ్రామ బహిష్కరణ చేయడమే కాకుండా కనీసం ఓటును కూడా వేయకుండా చేశారని మండిపడ్డారు. పోలీసులు కూడా టీడీపీ వాళ్లకే సహకరించారని విమర్శించారు. రౌడీ షీటర్లను తీసుకొచ్చి పునరావాస మీటీంగ్‌లు పెడుతున్నారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు