యనమల స్వయం ప్రకటిత మేధావి

17 Feb, 2020 14:35 IST|Sakshi

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

సాక్షి, తాడేపల్లి: ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్‌నోట్‌ను క్షుణంగా చదివితే అసలు బండారం బయటపడుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి బాగోతంపై ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులతో టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు.  ప్రెస్‌నోట్‌లో రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరగాయని పేర్కొంటే.. ఎక్కడ రెండువేల కోట్లు ఉన్నాయని యనమల రామకృష్ణుడు అంటున్నారని దుయ్యబట్టారు. యనమలను స్వయం ప్రకటిత మేధావిగా అమర్‌నాథ్‌ అభివర్ణించారు. యనమలకు పంటి నొప్పితో పాటు కంటి చూపు కూడా పోయిందని.. ఐటీ ప్రెస్‌ నోట్‌ ఇచ్చింది వైఎస్సార్‌సీపీ కాదని..కేంద్ర ఐటీ శాఖ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.('మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా')

ఆ ధైర్యం ఉందా..?
రెండు వేల కోట్ల టర్నోవర్ లేని కంపెనీల పెట్టి ఆర్థిక లావాదేవీలు జరిపారని స్పష్టం గా ప్రెస్‌నోట్‌ లో ఐటీ అధికారులు పేర్కొన్నారని..  చంద్రబాబు అండ్‌ కో, ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అని అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. ‘ఐటీ అధికారులు మీద పరువు నష్టం దావా వేసే ధైర్యం చంద్రబాబు కు ఉందా.. ఆయన ఆస్తులు మీద సీబీఐ విచారణ జరపమని కోరే ధైర్యం టీడీపీ నేతలకు ఉందా.. కొంతమంది చంద్రబాబు చెంచా నేతలు వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తున్నారని’ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ దాడులపై చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు.

అర్థరాత్రి కూడా మీడియా సమావేశాలు పెట్టే ఆయన ఎక్కడ..?
‘అర్థరాత్రి పూట కూడా మీడియా సమావేశాలు పెట్టే చంద్రబాబు ఎక్కడున్నారు.. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్‌ ఎందుకు నోరు మెదపడం లేదు. చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచేందుకు సహచర నేతలు సిద్ధంగా ఉన్నారు. కనీసం ఓటుకు నోటు మీద అయిన విచారణ కోరే ధైర్యం ఉందా..? జయము జయము చంద్రన్న పాటలు కాదు.. జైలు జైలు చంద్రన్న పాటలు వేసుకోవాలని’ ఎద్దేవా చేశారు. ఈడీ, సీబీఐను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంది చంద్రబాబేనన్నారు. హైదరాబాద్‌కు ఎందుకు ఆయన రాత్రికి రాత్రే  ఆయన పారిపోయారని అమర్‌నాథ్‌ ప్రశ్నించారు.(ఐటీ ఉచ్చులో అవినీతి చక్రవర్తి

ప్రజలతోనే పొత్తు..
తమకు ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదని.. ప్రజలతోనే పొత్తు అని అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఐటీ దాడులు నుంచి దృష్టి మళ్లించడం కోసం బీజేపీతో పొత్తు అంటూ ఎల్లో మీడియా వార్తలు రాస్తోందని మండిపడ్డారు. హోదా ఇస్తేనే ఏ పార్టీతో అయినా పొత్తు ఉంటుందని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. రెండువేల రూపాయలకు నైతికత అమ్మేసుకున్నారని ప్రజలను కించపరిచే విధంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతున్నారని.. ఆయన భీమవరంలో 50 కోట్లు ఖర్చు చేయలేదా అంటూ అమర్‌నాథ్‌ దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు