మీకు శాశ్వత క్వారంటైన్‌ తప్పదు: జోగి రమేష్‌

18 Apr, 2020 17:10 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కట్టడికై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న చర్యలను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆర్ధిక ఇబ్బందుల్లో కూడా ప్రజారోగ్యం కోసం ఖర్చుకు వెనకాడకుండా సీఎం ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. దక్షిణ కొరియా నుంచి లక్ష రాపిడ్ కిట్లను ప్రత్యేక విమానంలో తెప్పించి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇలాంటి తరుణంలో ఉనికిని కాపాడుకునేందుకు సిగ్గూశరం వదిలి టీడీపీ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజారోగ్యం పట్టని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు రాజకీయ సమాధి తప్పదని వ్యాఖ్యానించారు.

‘‘దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తోంది. సీఎం జగన్‌ విధానాలను అందరూ అభినందిస్తున్నారు. మీ దగ్గర నీతులు చెప్పించుకొనే స్థాయిలో మా ముఖ్యమంత్రి లేరు. పిచ్చి కూతలు కూస్తే తండ్రీకొడుకులకు శాశ్వత క్వారంటైన్‌ తప్పదు. సిగ్గు వదిలి టీడీపీ ఆరోపణలకు దిగుతోంది. ఇక బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ బుద్ధిలేకుండా టీడీపీకి వంతపాడుతున్నారు. కరోనా కేసుల లెక్కలు కేంద్రం , రాష్ట్రం ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నాయి. ఆ విషయం కూడా తెలియకుండా కన్నా వ్యాఖ్యలు చేయటం విడ్డురంగా ఉంది’’ అని జోగి రమేష్‌ విమర్శించారు. 

మరిన్ని వార్తలు