రాజకీయ లబ్ధికోసమే టీడీపీ కుట్రలు

12 Mar, 2020 14:20 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే  కొలుసు పార్థసారథి

సాక్షి, విజయవాడ: పోలీసులకు సమాచారం ఇవ్వకుండా టీడీపీ నేతలు మాచర్ల ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. దివ్యాంగుడిని కారుతో ఢీకొట్టి టీడీపీ నేతలు పారిపోయే ప్రయత్నం చేశారని.. టీడీపీ నేతల వైఖరిపై స్థానికులు కోపోద్రిక్తులయ్యారని పేర్కొన్నారు. (‘ఆ స్థితికి టీడీపీ దిగజారిపోయింది’)

గతంలో బుద్ధా వెంకన్న, బోండా ఉమా ఐఏఎస్‌ అధికారిపై దాడి చేశారని పార్థసారథి గుర్తు చేశారు. గొడవలు సృష్టించడానికే 10 కార్లలో టీడీపీ నేతలు వచ్చారని ఆరోపించారు. గతంలో వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు ఇష్టారీతిన దాడులకు దిగారని దుయ్యబట్టారు. దౌర్జన్యం చేసి స్థానిక ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. డబ్బు,మద్యం పంపిణీ ఉండకూడదని చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. భయానక వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని పార్థసారథి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు