చింతమనేనీకి రాజ్యాంగంపై గౌరవం లేదు

18 Nov, 2019 09:47 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు

సాక్షి, పెదపాడు/పెదవేగి: జైలు నుంచి వచ్చిన చింతమనేని ప్రభాకర్‌ ఎన్నికల్లో విజయం సాధించిన చందంగా ప్రెస్‌మీట్‌ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నా రు. పెదవేగి మండలంలోని జానంపేట ఇసుక డంపింగ్‌యార్డు వద్ద ఆయన ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. చింతమనేని న్యాయం, ధర్మం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాల వల్లించినట్లుందన్నారు. అతను మీడియా సోదరులను ఏవిధంగా గౌరవించారో తెలియదా? ఆనాడు మీడియా గుర్తుకురాలేదా అంటూ ప్రశ్నించారు. ‘దమ్ముంటే జగన్, పవన్‌ తనపై గెలవాలని చింతమనేని సవాల్‌ విసిరాడు.. నేను ఆనాడే చెప్పాను.. నా రాకతో నీ రాజకీయ పతనం ప్రారంభమైందని.. చెప్పినట్లే ఓడించి అత్యధిక మెజార్టీతో గెలిచాను’ అని ఎమ్మెల్యే కొఠారు అన్నారు. ఈవీఎంలలో మోసాలతో ఓడిపోయానని చింతమనేని చెప్పడం చూస్తుంటే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన  ఆయనకు రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని అర్థమవుతోందన్నారు. ఆయన వెనుక ఎస్సీ సోదరులే ఉంటారని చెబుతున్న చింతమనేని కూచింపూడి గ్రామంలో ఎస్సీ సోదరులపై దాడి చేయలేదా? వారిపై కేసులు పెట్టించలేదా అని ఎమ్మెల్యే కొఠారు ప్రశ్నించారు. 66 రోజులు జైలులో ఉన్నా చింతమనేనిలో పశ్చాత్తాపం కనిపించడం లేదని, ఆయన చేసిన తప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ సవాల్‌ విసిరా రు.

ఆయనపై కేసులు పెట్టింది, రౌడీషీట్‌ ఓపెన్‌ చేయించింది టీడీపీలోనే కదా.. తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఏం సంబంధం, దమ్ముంటే చంద్రబాబును ప్రశ్నించు అని చింతమనేనికి సలహా ఇచ్చారు. తోక బ్యాచ్‌ను వేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.  రాష్ట్రంలో దెందులూరుకు అభివృద్ధిలో ప్రత్యేక స్థానం తీసుకువస్తామని ఎమ్మెల్యే కొఠారు అన్నారు. చేసిన మంచి పనులను అభినందించు చేతకాకపోతే ఏ ఫామ్‌హౌస్‌లోనో, ఇంట్లోనో ప్రశాంతంగా కూర్చో.. తోక జాడిస్తే కట్‌ చేస్తామని హెచ్చరించారు. దెందులూరు నియోజకవర్గంలో ఉన్నది జగనన్న మిత్రుడు, సైనికుడన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన గేదెలు 500లో 600లో ఉన్నాయి కదా? అవి కాసుకుంటూ జీవనం సాగించు.. పుణ్యమైనా కాస్త దక్కుతుందన్నారు.   
 

ఇష్టానుసారం మాట్లాడితే సహించం 
కొఠారు రామచంద్రరావు మాట్లాడుతూ చింతమనేని తన స్థాయిని మరిచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదన్నారు. టీడీపీ హయాంలో అనుకూలురైన పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంతో మంది మహిళలను చింతమనేని పోలీస్‌స్టేషన్లో పెట్టించలేదా? తహసీల్దార్‌ లీలాప్రసాద్‌ను సీఈఓ ముందు చెంప మీద కొట్టలేదా? మంత్రి వట్టి వసంతకుమార్‌పై దాడిచేయలేదా? అంటూ ప్రశ్నించారు. అక్రమాస్తులు లేవని సెంట్‌ కూడా ఆక్రమించలేదని చింతమనేని చెబుతున్నారని, 3.50 ఎకరాల ఉన్న చింతమనేని తండ్రికి వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చా యని ప్రశ్నించారు. మీ దగ్గరేమైనా మంత్రదండం ఉందా అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీ, హైదరాబాదుతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను రుజువు చేస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు