చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు

11 Sep, 2019 12:07 IST|Sakshi
బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ

సాక్షి, అనంతపురం(పెనుకొండ) : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మండిపడ్డారు. మంగళవారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ గత ఐదేళ్లు ప్రజలను మోసగించిన చంద్రబాబుకు ప్రజలు 23 ఎమ్మెల్యేలతో సరిపెట్టారన్నారు. ఘోర ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి ఆయనపై ఓర్వలేక బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు అమరావతిని భ్రమరావతిగా చేసి ఐదేళ్ల పాటు ప్రజలను మోసం చేశారన్నారు.

అమరావతిలో ఉన్నది ముళ్ల కంపలు, డ్రైనేజీలే తప్ప ఎలాంటి అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఐదేళ్ల టీడీపీ పాలనలో హత్యలు తప్ప అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు.  దుద్దేబండ, వెంకటగిరిపాళ్యం, రామగిరి వంటి ప్రాంతాల్లో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు తెగబడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా ఎస్పీగా సత్యయేసుబాబును నియమించడం వెనుక జిల్లాలో శాంతి కుసుమాలు విరబూయించాలనే ఉద్దేశం ఉందన్న అంశాన్ని టీడీపీ నాయకులు అవగతం చేసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు