అందుకే ఆర్కే భరించలేకపోతున్నారు

22 Sep, 2019 11:46 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఏపీ సచివాలయ ఉద్యోగాల్లో టాపర్‌గా బీసీ మహిళ నిలిచారని, ఇది కులపిచ్చి ఉన్న ఏబీఎన్ రాధాకృష్ణ  భరించలేకపోతున్నారని వైఎస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెనుకబడిన వర్గాల్లో విప్లవాత్మక మార్పుకోసం ప్రయత్నిస్తుంటే.. ఏబీఎన్‌ రాధాకృష్ణ, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడులు అవాస్తవాలను  ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఏపీలో ముందెన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం సీఎం జగన్‌ పాలనలో కనిపిస్తోంది.

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో లక్షా 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. బీసీలకు లక్ష, ఎస్సీలకు 64 వేలు,  ఎస్టీలకు 10 వేల ఉద్యోగాలు దక్కాయి. ఏబీఎన్ రాధాకృష్ణ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. గత ప్రభుత్వ కాలంలో అధికారిక ప్రచారాల పేరుతో ఏబీఎన్ ఛానల్ కోట్లాది రూపాయలు దోపిడీ చేసింది. ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లలో వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు రాధాకృష్ణ అకృత్యాలపై గొంతు విప్పాలి. ఏబీఎన్ రాధాకృష్ణ అకృత్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్ట పరమైన విచారణకు ఆదేశించాల’’ ని కోరారు.

మరిన్ని వార్తలు