‘చంద్రబాబు పాలనంతా దళితులపై దాడులే’

4 Sep, 2019 17:35 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : వినాయకుడి పూజకు వెళ్లిన దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ నేతలు కులం పేరుతో దూషించడం దారుణమని  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. టీడీపీ నేతలు రోజు రోజుకి దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కుల దూషణలో చంద్రబాబే మొదటి ముద్దాయి అని ఆరోపించారు. చంద్రబాబు పాలనంతా దళితులపై దాడులే జరిగాయన్నారు. దళితులు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చుట్టాలుగా మారుతున్నారని వారిపై చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ పాలనలో దళిత మహిళలను వివస్త్రను చేసి దాడులు చేశారన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని, ఆయనకు రాజ్యాంగంపై గౌరవం లేదని నాగార్జున ఆరోపించారు.

(చదవండి : దళిత మహిళా ఎమ్మెల్యేకు తీవ్ర అవమానం)

టీడీపీ యాంటీ దళిత పార్టీ : సుధాకర్‌ బాబు
రాజధాని ప్రాతంలో దళిత మహిళ ఎమ్మెల్యే శ్రీదేవిపై జరిగిన దాడిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు  తీవ్రంగా ఖండించారు. దళితులను అవమానించిన చంద్రబాబును ఆపార్టీ దళిత నేతలు నిలదీయకపోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ యాంటీ దళిత పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డీఎన్‌ఏలోనే నాయకత్వ లోపం ఉందన్నారు.  టీడీపీ నేతలు చేస్తున్న పనులకు రాష్ట్రం సిగ్గుతో తలదించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిని సీఎం జగన్‌ బయటపెడుతుంటే తట్టుకోలేకనే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు