‘పగలు కాంగ్రెస్‌తో కాపురం.. రాత్రి బీజేపీతో సంసారం’

11 Aug, 2018 16:05 IST|Sakshi

సాక్షి, గుంటూరు : టీడీపీ నాయకులు వైఎస్‌ జగన్ సతీమణిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఉరుకోమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ముస్తాఫా, అప్పిరెడ్డిలు హెచ్చరించారు. టీడీపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. శనివారం ఇక్కడ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎలాగో అలా గెలవాలని టీడీపీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. నియోజక వర్గంలోని నాయకులను లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని ముందే తెలుసుకొని అన్ని విధాల జగన్‌ను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నారన్నారు. అధికారాలను, డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పగలు కాంగ్రెస్‌తో కాపురం, రాత్రి బీజేపీతో సంసారం చేయడం టిడీపీకే చెల్లుబాటు అవుదుందని ఎద్దేవా చేశారు. 

వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు
అధికారుల అండతో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను  తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే లక్షకు పైగా ఓట్లను తొలగించారని ఆరోపించారు. డోర్‌ నెంబర్‌ మారుపేరుతో మున్సిపల్‌ అధికారులు నియోజకవర్గాన్ని అస్తవ్యస్తంగా తయారుచేశారని విమర్శించారు. ఓకే డోర్‌ నెంబర్‌లోని ఓట్లు, ఓకే కుటుంబానికి చెందిన ఓట్లు నాలుగు బూతుల్లో కేటాయించారని ఆరోపించారు. అధికారుల్లో ఇప్పటికైనా మార్పురావాలని, లేకపోతే భవిష్యత్తులో కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని హెచ్చరించారు. మైనారీటీలపై టీడీపీకి ప్రేమ ఉంటే నాలుగెళ్లల్లో ఒక్క మంత్రి పదవైనా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. మైనార్టీలు టీడీపీని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు