అమ్మఒడితో విద్యాభివృద్ధి సాధిస్తాం

9 Jan, 2020 20:15 IST|Sakshi

సాక్షి, కృష్ణా: అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. ‘ అమ్మఒడి’తో విధ్యాభివృద్ధి సాధిస్తామని తెలిపారు. గురువారం ఆయన పెనమలూరులో నిర్వహించిన ‘జగనన్న అమ్మఒడి’కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ.. విద్య లేకపోవడం వల్లే ఆర్థిక తారతమ్యాలు ఏర్పడుతున్నాయని, ‘అమ్మఒడి’తో ఈ అసమానతలు తొలగిపోతాయని పేర్కొన్నారు. ఇంగ్లీష్‌ మీడియంతో ఎస్సీ, బీసీ, మైనార్టీ పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.

(చదవండి : ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి: సీఎం జగన్‌)

ఆంగ్ల మాధ్యమంపై టీడీపీ రాద్ధాంతం చేయడం సిగ్గు చేటన్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని ఆరోపించారు. సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్‌ కుటుంబం రైతు పక్షపాతి అని, ప్రతి రైతుకు సీఎం జగన్‌ రైతు భరోసా అందించారని ప్రశంసించారు. గ్రీన్‌ జోన్‌ పేరుతో కృష్ణా జిల్లాను చంద్రబాబు నాయుడు నాశనం చేశాడని విమర్శించారు. ఇప్పుడు కృష్ణా జిల్లా రైతుల గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లక్షకోట్లు రూపాయలు అమరావతిలో పెడితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అభివృద్ధిని వికేంద్రీకరిస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాజధానిపై సీఎం జగన్‌ తీసుకునే నిర్ణయానికి అందరూ అండగా నిలవాలని పార్థసారధి కోరారు.

మరిన్ని వార్తలు