వైఎస్సార్‌పై అభిమానంతోనే పరీక్షిత్‌తో పెళ్లి..

22 Jun, 2018 13:54 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భర్త పరీక్షిత్‌రాజ్‌తో...

నియోజకవర్గంలో ప్రతి పల్లెగడపకూ వెళ్లా

అభివృద్ధి కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నా

జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే అదే చాలు

‘సాక్షి ప్రతినిధి’తో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే  పాముల పుష్పశ్రీవాణి

‘లక్ష్యం గొప్పదైనప్పుడు నడిచే దారిలో రాళ్లున్నా.. ముళ్లున్నా లెక్క చేయకు’ అని పెద్దలు చెప్పిన మాటలను మనసుకెక్కించుకున్న ఓ సాధారణ మహిళ. తనకు తెలియకుండానే మహానేత వై.ఎస్‌.రాజశేఖరెడ్డిపై అమితమైన అభిమానం పెంచుకుని... ఆ కారణంగానే పరీక్షిత్‌రాజ్‌ను పెళ్లి చేసుకుని వైఎస్‌ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అటు ప్రజా ప్రతినిధిగా, రాజకీయనేతకు భార్యగా సమతూకం పాటిస్తూ ప్రజల ఆదరాభిమానాలు గెలుచుకుంటున్నారు. ఆమే కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి. మారుమూల గిరిజన పల్లెల్లో ప్రతి గడపా తొక్కారు. ప్రతి ఇంటి సమస్యా తెలుసుకున్నారు. వాటికోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు.శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భం గా ‘సాక్షి ప్రతినిధి’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.....

సాక్షి ప్రతినిధి, విజయనగరం: మాది పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామం. మేం ముగ్గురం అక్కా చెల్లెళ్లం, ఒక తమ్ముడు. నేను రెండో అమ్మాయిని. మా నాన్న పేరు నారాయణమూర్తి. ప్రధానో పాధ్యాయునిగా పనిచేశారు. నేను 10వ తరగతి వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నాను. ఇంటర్‌ జంగారెడ్డిగూడెం సూర్య కళాశాలలో, డిగ్రీ అక్కడి ఉమెన్స్‌ కళాశాలలో చదువుకున్నాను. విశాఖలో బీఈడీ చేశాను. చదివిన గిరిజన ఆశ్రమ పాఠశాలలోనే ఏడాదిన్నర పాటు టీచర్‌గా పనిచేశా.

చిన్నతనం నుంచేపాలిటిక్స్‌పై మక్కువ
మాకు బ్యాక్‌ గ్రౌండ్‌ అంటూ ఏమీ లేదు. కానీ చిన్నప్పటి నుంచీ పాలిటిక్స్‌ అంటే చాలా ఇష్టం. ఎన్నికలకు ముందు పెళ్ళి చూపుల్లోనే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉంటుందన్నారు. వైఎస్సార్‌సీపీ అయితేనే పోటీ చేస్తాను, ఇంకేదైతే నో అని చెప్పా. పెళ్ళయిన 15 రోజులకే నన్ను వైఎస్సార్‌సీపీ కురుపాంనియోజకవర్గ కోఆర్డినేటర్‌గా నియమించారు. మార్చి 14న పరీక్షిత్‌ రాజుతో పెళ్లయింది. నెల రోజులకే ఎలక్షన్‌ ప్రచారానికి వెళ్లా. మే 6న ఎలక్షన్‌. ఎమ్మెల్యేగా 19 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచా.

వైఎస్‌ కోసమే పెళ్లికి ఒప్పుకున్నా: 2004లో నేను డిగ్రీ చేస్తున్నాను. అప్పుట్లో రాజశేఖరరెడ్డి గెలుస్తారా, చంద్రబాబు నాయుడు గెలు స్తారా అని మా ఫ్రెండ్స్‌లో బెట్టింగ్‌లు కూడా జరి గాయి. మేం అన్నట్టే రాజశేఖరరెడ్డి గెలిచారు. సమ్మర్‌ హాల్‌డేస్‌కి చింతలపూడి దగ్గరున్న వెలగలపల్లిలో మా ఫ్రెండ్‌ ఇంటికి 15 రోజులు వెళ్ళా. వారితో ఎప్పుడూ రాజకీయాల కోసం, వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి కోసమే చర్చ జరిగేది. అప్పుడే నా కు రాజశేఖరరెడ్డి అంటే చాలా అభిమానం పెరిగిపోయింది.  మా నాన్న హెచ్‌ఎంగా పనిచేసేవారు. అయినా నేను వైఎస్‌ ఫొటోలను తీసుకుని ఇంటి నిండా అంటించేశాను. మనం ఉద్యోగులం అలా చేయకూడదమ్మా అని మా నాన్న చెప్పినా వినేదా న్ని కాదు. వైఎస్‌ కోసమే పరీక్షిత్‌తో పెళ్లికి ఒప్పుకున్నా. నాకేదైనా కష్టం వస్తే రాజశేఖరరెడ్డి ఫొటో దగ్గరకు వెళ్ళే చెప్పుకుంటాను. అలా ఆయన ఫొటో ముందు చెప్పుకోబట్టే నేను ఇలా ఎమ్మెల్యే ని అయ్యానని అనుకుంటాను.

జగన్‌ మెచ్చుకున్నారు: నేనూ, నా భర్త ఏనాడూ డబ్బుకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వం. విలువలకే ప్రాధాన్యమిస్తాం. చాలా మంది ఫోన్‌ చేసి ప్రలోభాలు ఎరవేశారు. కానీ మేం దేనికీ లొంగలేదు. ఆ సమయంలో వైఎస్‌పై మాకున్న అభిమానాన్ని చాటిచెప్పడం కోసం చేతిపై ‘వైఎస్‌ఆర్‌’ అని పచ్చబొట్టు పొడిపించుకున్నాను. ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎన్ని కష్టాలెదురైనా తట్టుకుని నిలబడటం జగన్‌ నుంచే నేర్చుకున్నాం. ఆయన బాటలోనే నడుస్తూ ఆయన ప్రేమను పొందగలిగాం. లోటస్‌పాండ్‌లో ఒకసారి రివ్యూ జరిగింది. గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం నేను బాగా చేసానని ఆయన నన్ను మెచ్చుకున్నారు. కార్యకర్తలు అలసిపోయేవారు, రిపోర్టర్స్‌ అలసిపోయే వారు కాని నేను మాత్రం 600 గడపలు తిరిగేసే దాన్ని. అదే అందరికీ చెప్పాను.

పర్సనల్‌ లైఫ్‌కి దూరమయ్యాం : పర్సనల్‌ లైఫ్‌ మొత్తం కిల్‌ అయిపోయింది. నాలు గు రోజులు ఎక్కడికైనా వెళ్ధామన్నా ఇక్కడ ఏమైపోతుందో, జనం ఎలా ఉన్నారోనన్న భయం. అందుకే ఎక్కడికీ వెళ్ళలేదు. పెళ్ళయిన తరువాత పొలిటికల్‌గా వెళ్ళడమే తప్ప పర్సనల్‌గా ఎక్కడికీ వెళ్ళలేదు. ఐదేళ్ళు కష్టపడితే తరువాత జగనన్న సీఎం అయితే చాలు అంతా హ్యాపీగా ఉంటాం.

ఇంట్లో అమ్మాయిగా చూస్తారు
గిరిజన ప్రాంతాలకు వెళ్తుంటే వాళ్ళింట్లో అమ్మా యి  ఎమ్మెల్యే అయినట్టు ఫీలవుతారు. వాళ్ళ మధ్యలోనే కూర్చొని భోజనం చేస్తాను. వాళ్ళ సమస్యలు వింటుంటాను. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళం. అధికారులను బతిమాలైనా పనులు చేయించుకోవాలి. అలానే చేయిస్తున్నాను. పూర్ణపాడు, లాబేసు వంతెన 20 ఏళ్ల కిందట శంకుస్థాపన చేసి వదిలేశారు. దానికి నిధులు విడుదలయ్యేలా చేశాను. గడప గడపకు వెళ్ళడం, వారం రోజులు తిరగడం, ఆ ఫొటోలు అన్నీ కలిపి ఐటీడీఏ పీవోకి, కలెక్టర్‌కి ఇవ్వడం. ఇదే నా పని. జియ్యమ్మవలస మండలం చినతోలిమంద గిరిజన ఏరియాలో నా వల్లే రోడ్డు వచ్చిందని అక్కడి వారంతా నాకు చీరలు పరిచి తీసుకెళ్ళారు. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే సాక్షిలో వచ్చిన ఓ ఫొటోను(డోలి కట్టి ఆస్పత్రికి తీసుకెళ్ళడం) అసెంబ్లీలో స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్ళాను. కొమరాడ మండలం కల్లికోటకు వెళ్తే అక్కడి ఆడవాళ్ళు మాకు మంచినీటి సమస్య తీర్చమ్మా చాలు నిన్ను జీవితాంతం  గుర్తుపెట్టుకుంటాం అన్నారు. ఆ ఊరికి రూ.34 లక్షలు విడుదల చేయించాను. చినమేరంగిలో కూడా నీటిసమస్య తీర్చేందుకు రూ.25లక్షలు మంజూరు చేయించాను. ఇలా ఎన్నో చేస్తున్నాను. ఇవన్నీ ఒకెత్తయితే ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేనూ, పరీక్షిత్‌ ఎంత దూరమైనా వెళ్లి వారికి అండగా ఉంటాం. ఈ రోజు మా నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా నా పేరు తెలియని వారుండరు.

జగన్‌ నా దైవం
టీవీలో జగన్‌ పేరు వినిపిస్తే చాలు కదిలేదాన్నే కాదు. జగన్‌ జైలు నుండి విడుదలైన రోజే మా మదర్‌కి యాక్సిడెంట్‌ అయిం ది. మా అమ్మకోసం హాస్పిటల్‌లో ఫారాలు నింపాల్సిందీ నేనే. అయినా ఎవరి మాటలు వినకుండా టీవీ వద్దకు పరిగెత్తా. ఆయన ఫేస్‌ చూడకపోతే నా జన్మ వేస్ట్‌ అని పించింది. 16 నెలలు వెయిట్‌ చేశాం ఆయన కోసం. జగన్‌ మాకు దేవుడు. చాలా మంచి వ్యక్తి. అంత ఆప్యాయత ఏ లీడర్‌లోనూ చూడలేదు. ఆయనది చాలా గొప్ప వ్యక్తిత్వం.

భార్యగానూ సక్సెస్‌
వాణి నాకు భార్యగా దొరకడం నా అదృష్టం. ముందుగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం వాళ్లది. అయినప్పటికీ ఒక పరిపూర్ణ పొలిటీషియన్‌కు ఉండాల్సిన అన్ని క్వాలిటీలు అమెలో ఉన్నాయి. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించడం, ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడటం ఆమెకున్న మంచి లక్షణం. ఎమ్మెల్యేగా ప్రజల కోసం ఎంతగా తపిస్తుందో, భార్యగా నా కోసం అంతే బాధ్యతగా మెలుగుతుంది. నాకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేదు. తనను ఎవరేమన్నా పెద్దగా పట్టించుకోదు. నన్నెవరైనా చిన్న మాట అంటే మాత్రం అస్సలు ఊరుకోదు. జగన్‌ను సీఎం చేయడమే మా ఇద్దరి ఏకైక లక్ష్యం.– శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు,వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు

మరిన్ని వార్తలు