వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్
సాక్షి, తిరుమల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అసహనం పెరిగిపోయిందని అందుకే.. వైఎస్ జగన్ను సినీ నటుడు నాగార్జున కలిస్తే ఓర్వలేకపోతున్నారని తెలిపారు. శుక్రవారం తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు.. నేర చరిత్ర కలిగిన వారిని పక్కన పెట్టుకుంది చంద్రబాబేనని, సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనదేనని విమర్శించారు. చంద్రబాబుపై 18 కేసులు ఉన్నా... నేటికి విచారణకు హాజరు కాకుండా తిరుగుతున్నారన్నారు. ఇంట్లో బాంబులు పేల్చిన కోడెల శివప్రసాదరావు, గన్ పేల్చిన బాలకృష్ణను పక్కన పెట్టుకుంది చంద్రబాబు కాదా? అని రోజా సూటిగా ప్రశ్నించారు.
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్ జగన్పై కుట్రపూరితంగా కేసులు పెట్టాయన్నారు. అయినా వైఎస్ జగన్ విచారణకు హాజరై అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుంది చంద్రబాబేనని, అందుకే ఆపరేషన్ గరుడ ప్లాన్తో వైఎస్ జగన్ను హత్య చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఐదేళ్లుగా చంద్రబాబు ఎన్ని యూటర్న్లు తీసుకున్నారో ప్రజలు గమనిస్తున్నారని, ఆయన మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు.