ఆ ఆత్మహత్య.. ప్రభుత్వ హత్యే: రోజా

28 Aug, 2018 14:08 IST|Sakshi

సాక్షి, తిరుపతి : రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రామయ్య దంపతులది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో లబ్ధిపొందడానికే సీఎం చంద్రబాబు అబద్ధాల హామీలు ఇచ్చారని మండిపడ్డారు. ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదని, ఈ హామీ వట్టి బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల రుణాలు కూడా మాఫీ కాలేదని, ఈ బూటకపు హామీలతో అమాయక ప్రజలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబు కార్మిక ద్రోహిఅని, ఆయన పాలనలో చిత్తూరు, రేణిగుంట ఫ్యాక్టరీ, విజయపాల ఫ్యాక్టరీలు మూతబడ్డాయన్నారు. తిరుపతి ఆర్టీసీ గ్యారేజ్‌ మంచి గుర్తింపు పొందిందని, కార్మికుల పొట్టకొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి ఆర్టీసీ గ్యారేజ్‌ను ఇతర జిల్లాలకు తరలించేయత్నం జరుగుతోందన్నారు. ఈ గ్యారేజ్‌ కార్మికులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని  రోజా స్పష్టం చేశారు.

కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన రామయ్య దంపుతులు రుణమాఫీ కాలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ కాకపోవడంతో పాటు తీసుకున్న అప్పుకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.

చదవండి: రుణమాఫీ కాలేదని భార్యాభర్తల బలవన్మరణం

మరిన్ని వార్తలు