కడుపుకోతలు కనపడవా?

17 Oct, 2017 14:19 IST|Sakshi

విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటుంటే చీమ కుట్టినటై్టనా లేదా?

సీఎం చంద్రబాబుపై రోజా మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: నారాయణ, శ్రీచైతన్య, ఇతర కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థుల మరణాలకు సీఎం చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా స్పష్టం చేశారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల ర్యాంకుల దాహానికి విద్యార్థులు నిత్యం బలవుతున్నా అధికా రాన్ని అడ్డు పెట్టుకుని విద్యార్థుల బలవన్మర ణాలను ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తూ తల్లిదం డ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా సీఎంకి పట్టదా అని నిలదీశారు.

మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.  మూడున్నరేళ్లుగా ఆ విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే అది ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యం కాదా? అని రోజా ప్రశ్నించారు. విద్యార్థుల మరణాలను ఆపలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత? ఊడితే ఎంత? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 మంది విద్యార్థులు మరణించాక కానీ కార్పొరేట్‌ కాలేజీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించాలన్న ఆలోచన చంద్రబాబుకు రాలేదా? అని ప్రశ్నించారు.  తల్లిదండ్రుల కడుపుకోత చంద్రబాబుకు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. ఈ మరణ మృదంగానికి మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులే కారణమన్నారు. ఇంతమంది విద్యార్థులు చనిపోయాక కూడా గంటా తన పదవికి రాజీనామా చేయకపోవడం సిగ్గు చేటన్నారు. ‘చంద్రబాబు బినామీ కనుకనే నారాయణ కళాశాలకు గంటా వెళ్లలేదా? లేక తన కుమారుడే స్వయంగా నారాయణ అల్లుడు కనుక సగం వాటా వస్తుందని వెళ్లలేదా?’ అని ప్రశ్నించారు.  మంత్రివర్గం నుంచి గంటా, నారాయణలను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలి
సచివాలయంలో తన ఫోటోపై చెత్త వేస్తేనే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి ఉదయలక్ష్మితో విచారణ జరిపించిన చంద్రబాబు.. విద్యార్థుల మరణాలపై విచారణకు ఆదేశించక పోవడం శోచనీయమని రోజా విమర్శించారు. మరణించిన విద్యార్థుల కుటుం బాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు.

విద్యార్థుల ఆత్మహత్యలపై ఎమ్మెల్యే రోజా ఏమన్నారో చూడండి 

మరిన్ని వార్తలు