40 ఏళ్ల మీ రాజకీయ అనుభవం ఇదేనా?

17 Mar, 2018 15:26 IST|Sakshi
వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి (ఫైల్‌ ఫోటో)

చంద్రబాబుపై మండిపడ్డ శ్రీకాంత్‌రెడ్డి

సాక్షి, రాయచోటి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను వంచించడానికి అనేక కుట్రలు చేస్తున్నారని, ఆయన కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలోని ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని చెప్పిన చంద్రబాబు ప్రత్యేకహోదా విషయంలో అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తామనగానే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారనీ.. ప్రత్యేకహోదాపై వైఎస్‌ఆర్‌సీపీకి క్రెడిట్‌ వస్తుందన్న భయంతో బాబు డ్రామాలు ఆడటం మొదలుపెట్టారని విమర్శించారు.

ప్రత్యేహోదాకు ఎవరు మద్దతు ఇస్తారో వారితో కలిసి పోరాడాతామని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, గల్లా జయదేవ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎందుకు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 90 వేల కోట్ల రాష్ట్ర అప్పును రెండు లక్షల కోట్లకు చేసింది మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవమేనా? అని చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఎవరికీ భయపడను అంటూనే కేసులకు చంద్రబాబు భయపడుతున్నారని, ఈ దేశంలో ఆయనను మించిన ఆర్థిక నేరగాడు ఎవరులేరని, అందుకే ఆయనను కేంద్రం దూరంగా పెడుతుందని విమర్శించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధికి తాము గర్వపడుతున్నామని శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు