‘రెండు వేల పెన్షన్‌.. వైఎస్‌ జగన్‌ విజయమే’

14 Jan, 2019 17:02 IST|Sakshi

సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు ప్రకటించిన రూ. రెండు వేల పెన్షన్‌ కచ్చితంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విజయమేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పే స్వామి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  పాదయాత్రలో వృద్ధులకు రెండు వేల రూపాయల పెన్షన్‌ ఇస్తామని ప్రకటించడంతో చంద్రబాబు నాయుడు భయపడి ఎన్నికల ముందు పెన్షన్‌ను పెంచారని ఆరోపించారు.

ఎన్నికల ముందు ఓట్లు దండుకోవడానికి పెన్షన్‌ పెంచారని, దీన్ని ప్రజలు హర్షించడంలేదని చెప్పారు. ఈ రోజు ప్రజలకు రెండు వేల రూపాయల పెన్షన్‌ వస్తుంది అంటే ఇది వైఎస్‌ జగన్‌ విజయమే అన్నారు. 2014ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే మడకశిర నియోజకవర్గంలోని అన్ని చెరువులకు హంద్రీనీవా ద్వారా నీరు నింపుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇంతవరకు ఒక్క చెరువును కూడా నింపలేదని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో మరోసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారని తిప్పే స్వామి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు