‘సుబాబుల్ రైతులను ఆదుకుంటాం’

26 Jul, 2019 15:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం తీరుతో సుబాబుల్ రైతులకు అన్యాయం జరిగిందని వైఎస్సార్‌  కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుబాబుల్ రైతుల విషయంలో అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్యాయంగా వ్యవహరించారని ఆరోపించారు. సుబాబుల్ రైతులతో సమావేశం ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనకు చెప్పారని తెలిపారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి  వసంత కృష్ణప్రసాద్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా సుబాబుల్ రైతులను దేవినేని సోమరిపోతులని విమర్శలు చేశారని మండిపడ్డారు. 

అదేవిధంగా అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. సుబాబుల్ రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభలో మంచి శుభవార్త చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సుబాబుల్ రైతులకు రూ.5.40 కోట్ల బకాయిలను చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అదేవిధంగా కౌలు రైతులకు రూ. 12, 500 ఇస్తామని సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల వ్యవసాయ రంగం మరింత విస్తరించనుందని సామినేని ఉదయభాను ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు