-

చంద్రబాబు నాటకాలాడుతున్నారు : విశ్వేశ్వర రెడ్డి

5 Feb, 2018 11:21 IST|Sakshi
వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి

సాక్షి, అనంతపురం: కేంద్ర బడ్జెట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలాడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి మండిపడ్డారు.  సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వం అసమర్థతపై నిప్పులు చెరిగారు.  మోదీ సర్కార్‌తో యుద్దమంటూ మీడియాకు లీకులిచ్చారని, తర్వాత ఎన్డీఏలో కొనసాగుతామని అధికారిక ప్రకటనలు చేయడం చూస్తే ఆయనకు రాష్ట్రం పట్ట ఉన్న అభిమానం ఏంటో అర్థమౌతోందని అన్నారు.

ఓటుకు నోటు కేసులో బయట పడేందుకే ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీపడ్డారని ఆరోపించారు. విభజన హామీలతో పాటు, ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలో సైతం విఫలమయ్యారని విశ్వేశ్వర రెడ్డి విమర్శించారు. తన అవినీతి బట్టబయలు అవుతుందనే చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి తెలుగుదేశం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ న్యాయమైందేనని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే సాధ్యమౌతుందన్నారు.

మరిన్ని వార్తలు