వైఎస్‌ జగన్‌ చరిష్మాతోనే గెలిచాం.. 

17 Jun, 2020 04:50 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి శ్రీరంగనాథరాజు, పక్కన ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌  చరిష్మాతోనే అందరం గెలిచామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చెప్పారు. ఎంపీ రాఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను ఖండిస్తూ విజయవాడలో మంగళవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, గ్రంధి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, ప్రసాద్‌రాజు మీడియాతో మాట్లాడారు. ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా వైఎస్‌ జగన్‌ ఫొటో పెట్టుకోవడం వల్లే గెలిచినట్టు తెలిపారు. అన్ని సామాజికవర్గాలనూ సీఎం సమానంగా చూస్తున్నారని వారు స్పష్టం చేశారు. రాఘురామకృష్ణరాజు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని, ఆయనకు రాజకీయ నాయకుడి లక్షణాలు లేవన్నారు. టికెట్‌ కోసం మూడు పార్టీలు మారారని దుయ్యబట్టారు. 

జగన్‌పై ఉన్న గౌరవంతోనే వైఎస్సార్‌సీపీలో చేరా : ఎంపీ రఘురామకృష్ణరాజు 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న గౌరవంతో వైఎస్సార్‌సీపీలో చేరానని ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. ఆయన మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తన గురించి మాట్లాడిన విషయాల్లో ఏమాత్రం వాస్తవాలు లేవన్నారు. అందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళదామని, ఎవరి బొమ్మకు ఎంత సత్తా ఉందో తేలుతుందని ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు